న్యూఢిల్లీ: ఒక కార్మికుడు కష్టపడి సంపాదించి దాచుకున్న రూ.లక్ష పోగొట్టుకున్నాడు. అయితే అతడి డబ్బు సంచిని కనుగొన్న ఓ కానిస్టేబుల్ అనంతరం సేఫ్గా తిరిగి ఇచ్చాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన విజయ్కుమార్ ఢిల్లీలోని షకుర్ బస్తీలో ఉంటూ కార్మికుడిగా పని చేస్తున్నాడు. యూపీలోని సొంతూరు ఖుర్జాలో పిల్లల కోసం ఇంటిని నిర్మించాలని భావించాడు. దీంతో బ్యాంకులో దాచుకున్న రూ.లక్ష డబ్బులను అతడు డ్రా చేశాడు. 55 కేజీల విలువైన రేషన్ సరుకులు కొన్నాడు. అనంతరం శివాజీ బ్రిడ్జ్ స్టేషన్కు చేరుకుని లగేజ్తో ఒక బెంచ్పై కూర్చొన్నాడు. ఇంతలో న్యూఢిల్లీ-బరేలీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రావడంతో రేషన్ సరుకుల సంచులతో హడావుడిగా రైలు ఎక్కాడు. అయితే లక్ష డబ్బు, పాస్ బుక్, కార్డులు, ఇతర వస్తువులు ఉన్న చేతి సంచిని రైల్వే స్టేషన్లోని బెంచ్పై మర్చిపోయాడు.
కాగా, అక్కడ శివాజీ బ్రిడ్జి రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నరేందర్ కుమార్ ఒక బెంచ్పై ఉన్న చేతి సంచిని చూశాడు. అక్కడి ప్రయాణికులను ఆరా తీయగా ఎవరూ తమది కాదని చెప్పారు. ఆ సంచిని తెరిచి చూడగా అందులో లక్ష నగదుతోపాటు విజయ్ కుమార్కు చెందిన బ్యాంకు పాసు పుస్తకం, చెక్ బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతోపాటు రొట్టెలు, వాటర్ బాటిల్ అందులో ఉన్నాయి. దీంతో ఆ కానిస్టేబుల్ నిజాయితీతో ఆ సంచిని సీనియర్ అధికారులకు అప్పగించాడు. అనంతరం విజయ్ కుమార్ను సంప్రదించేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు రైలు ఆనంద్ విహార్ స్టేషన్కు చేరుకున్నప్పుడు దాహాం వేయగా మంచి నీరు తాగేందుకు చేతి సంచి కోసం విజయ్ వెదికాడు. అది కనిపించకపోవడంతో డబ్బులున్న ఆ సంచిని రైలు ఎక్కిన స్టేషన్ వద్ద హడావుడిలో బెంచీపై మరిచిపోయినట్లు గ్రహించాడు. దీంతో తన కష్టార్జితాన్ని పోగొట్టుకున్నందుకు కన్నీరుమున్నీరయ్యాడు. వెంటనే రైలు దిగి శివాజీ బ్రిడ్జ్ స్టేషన్కు తిరుగు ప్రయాణమయ్యాడు. సాయంత్రం 6.30కు అక్కడకు చేరుకుని తాను పోగొట్టుకున్న డబ్బుల సంచి గురించి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కానిస్టేబుల్ నరేందర్ డబ్బుల కట్టలు, బ్యాంకు పుస్తకం, చెక్ బుక్, ఆధార్, రేషన్ కార్డు ఉన్న సంచిని సురక్షితంగా విజయ్కు అప్పగించాడు. యూపీ వెళ్లే మరో రైలులో అతడ్ని ఎక్కించి పంపాడు.