UP Key for Labour Codes | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నాలుగు లేబర్ కోడ్ల అమలు సాధ్యం కాకపోవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటి అమలుకు అవసరమైన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగా రూపొందిస్తున్నాయి. దీనికి తోడు వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్నందున లేబర్ కోడ్ల అమలు ఆలస్యం అవుతుందని కేంద్ర కార్మికశాఖ వర్గాల కథనం.
లేబర్ కోడ్లు అమలులోకి వస్తే వివిధ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు ఇండ్లకు తీసుకెళ్లే వేతనం తగ్గనున్నది. సదరు ఉద్యోగులు, కార్మికులకు సంబంధిత యాజమాన్యాలు అధిక ప్రావిడెండ్ ఫండ్ వాటా భరించాల్సి ఉంటుంది. లేబర్ కోడ్ల అమలుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేశామని కేంద్ర కార్మికశాఖ తెలిపింది. యూపీ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటిని అమలు చేయడానికి ఆసక్తిగా లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కొన్ని రాష్ట్రాలు నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు అవసరమైన ముసాయిదా నిబంధనలను రూపొందించాయి. వాటిలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా, పంజాబ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్ ఉన్నాయి.
నూతన వేతన కోడ్ల ప్రకారం ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చే అలవెన్స్లు 50 శాతం లోపే ఉండాలి. అంటే స్థూల వేతనంలో సగం సదరు ఉద్యోగుల కనీస వేతనంగా మారుతుంది. కనీస వేతనంలో ప్రావిడెండ్ ఫండ్ వాటాను గణిస్తారు. ఇందులో కనీస వేతనం, డీఏ కలిపి చూస్తారు.