హరిద్వార్: ఇండియాను కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తున్న వేళ నిర్వహించిన మహాకుంభమేళాలో పాల్గొనడానికి హరిద్వార్కు మొత్తం 91 లక్షల మంది వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్ 27 మధ్య ఈ 91 లక్షల మంది గంగలో మునకేసినట్లు కుంభమేళ ఫోర్స్ తెలిపింది. ఇందులో కేవలం ఏప్రిల్ నెలలోనే 60 లక్షల మంది రావడం గమనార్హం. అందులోనూ కేవలం ఏప్రిల్ 12న ఒక్కరోజే 35 లక్షల మంది రాగా.. అంతకుముందు శివరాత్రి సందర్భంగా మార్చి 11న 32 లక్షల భక్తులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
కుంభమేళా మొత్తం ముగిసిన తర్వాత బుధవారం నుంచి హరిద్వార్లో కర్ఫ్యూ విధించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు. హరిద్వార్తోపాటు రూర్కీ, లక్సర్, భగ్వాన్పూర్లలో కర్ఫ్యూ విధించారు. కుంభమేళా సందర్భంగా 13 అఖాడాల నుంచి 2 వేల మంది సాధువులు గంగలో రాజ స్నానాలు చేయగా.. అందులో కొందరికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఏప్రిల్ 30న ముగియాల్సిన ఈ కుంభమేళాను కరనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముందుగానే ముగించాలని ప్రధాని మోదీ కోరడంతో ఏప్రిల్ 17నే ముగిసినట్లు ప్రకటించారు.