పాత నేరస్తులపై నిఘా ఉంచాలి
నేర సమీక్షా సమావేశంలో సీపీ కమలాసన్రెడ్డి
రాంనగర్, ఏప్రిల్ 17: కేసుల దర్యాప్తును నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డి ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసుల్లో సత్వరమే స్పందిస్తూ విచారణ జరిపి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎల్, ఇతర కేంద్రాల్లో పెండింగ్లో ఉన్న నివేదికలను వెంటనే తెప్పించుకుని సంబంధిత కేసుల్లో చార్జీషీట్లు న్యాయస్థానాల్లో దాఖలు చేయాలన్నారు. వాటిని దాఖలు చేసిన కేసుల్లో సీసీ నంబర్లు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు, నేరాలు జరిగిన సందర్భాల్లో అనుసరించాల్సిన విధానాలను వివరించారు. ప్రమాద ఘటనల్లో పోలీస్స్టేషన్లకు తరలించిన వాహనాలను వారం రోజుల వ్యవధిలో సంబంధిత వాహనదారులకు అందజేయాలన్నారు.
పెండింగ్ వారెంట్ల అమలు కోసం కొనసాగిస్తున్న ఆపరేషన్ తలాష్ సత్ఫలితాలను సాధిస్తున్నదన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. సత్ప్రవర్తనతో మెదిలే పాత నేరస్తులపై హిస్టరీ షీట్లను తొలగిస్తామని ప్రకటించారు. వారంలో ఒకరోజు అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు శ్రమదానం చేసి స్టేషన్ ఆవరణను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలకు కనీస వసతులు కల్పించాలన్నారు. పోలీస్స్టేషన్లకు తాజాగా కేటాయించిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను టెక్డామ్లో అప్లోడ్ చేయాలన్నారు. అలాగే కొవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలు, డ్రైవర్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ (ఎల్అండ్వో) ఎస్ శ్రీనివాస్, ఏసీపీలు పీ అశోక్, జే విజయసారథి, సుందరగిరి శ్రీనివాసరావు, కే శ్రీనివాస్, తుల శ్రీనివాసరావు, ఆర్ ప్రకాశ్, విజయ్కుమార్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఉమేశ్కుమార్, ఏసీపీ వీ శ్రీనివాస్తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.