న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కుంభమేళాను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని హరిద్వారా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దీపక్ రావత్ స్పష్టం చేశారు. కుంభమేళాను ముందుగా ముగించే చర్చలేమీ జరగడం లేదని ఆయన వెల్లడించారు. నిజానికి కుంభమేళా జనవరిలోనే ప్రారంభమయ్యేది. కొవిడ్ పరిస్థితుల వల్ల ఈసారి ఏప్రిల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కుంభమేళాను ముందుగానే ముగించవచ్చు అని చెప్పింది. కానీ దీనిపై నాకు ఎలాంటి సమాచారం లేదు అని దీపక్ రావత్ చెప్పారు.
బుధవారం ఇదే విషయమై మత పెద్దలు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం మధ్య చర్చలు కూడా జరిగాయి. కుంభమేళాను ముందుగానే ముగించడానికి వాళ్లు సిద్ధంగా లేరు. రోజూ వేల మంది భక్తులు గంగలో మునకేయడానికి హరిద్వార్కు తరలి వస్తున్నారు. దీంతో కరోనా కేసులు భారీగా పెరిగిపోతాయేమోనన్న ఆందోళన అధికారుల్లో కలుగుతోంది. బుధవారం వరకు సుమారు 13 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.