నిధులు, నీళ్లు, నియామకాల దోపిడీ లక్ష్యం దాదాపు అరు దశాబ్దాలు తెలంగాణను వంచించిన సీమాంధ్ర నేతలు.. తెలంగాణ వనరులను ఎలా తమ వశం చేసుకున్నారనేదానికి సజీవ సాక్ష్యం శ్రీశైలం ప్రాజెక్టు. ఎక్కడి నుంచి ఏ లక్ష్యంతో ప్రారంభమై.. ఏ దిశగా మళ్లించారనేదానికి నిలువెత్తు నిదర్శనం శ్రీశైలం. కేవలం జల విద్యుత్తు ఉత్పత్తి కోసమే కృష్ణా బేసిన్లో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టును ఏకంగా పెన్నా బేసిన్కు తరలించుకు పోయేందుకు సీమాంధ్ర నేతలు, అప్పటి ప్రభుత్వాలు చేయని కుతంత్రాలు, కుయుక్తులు, మోసాలు లేవు. ఈ ప్రాజెక్టును సాగునీటి కోసమే నిర్మించారని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం దబాయింపులకు దిగుతుండటం వెనుక దశాబ్దాలుగా జరిగిన కుట్రల దాగున్నాయి.
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): 1952లో ఏఎన్ ఖోస్లా కమిటీ సిఫారసుల మేరకు కృష్ణానదిపై నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. కేంద్ర జల సం ఘం (సీడబ్ల్యూసీ) ముందుకు శ్రీశైలం ప్రాజెక్టు ప్రతిపాదన రాగానే మహారాష్ట్ర, కర్ణాటక తీవ్రం గా వ్యతిరేకించాయి. దాంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్తు ఉత్పత్తికి రాతపూర్వక హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ ఉత్తర్వుల్లోనూ, 1969లో ప్లానింగ్ కమిషన్ ప్రాజెక్టు మంజూరు విషయంలోనూ శ్రీశైలం జల విద్యుత్తు కోసమేనని స్పష్టంగా పేర్కొన్నాయి. 1976లో బచావత్ ట్రిబ్యునల్ తుది నివేదిక ప్రకారం కృష్ణా నది జ లాలను పంపిణీ చేస్తూ.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 800 టీఎంసీల నీటిని కేటాయించింది. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టును కేవలం జల విద్యు త్తు కోసమే కట్టినందున దీనికి సాగునీటి కేటాయించలేదు. నీటి ఆవిరి కింద 33 టీఎంసీలను కేటాయించింది. ఇవి కూడా ఏపీకి కేటాయించిన 800 టీఎంసీలలోనే చూపించారు. కృష్ణా బేసిన్లో రీజనరేట్ అయ్యే 70 టీఎంసీలలో 11 టీఎంసీలు ఏపీకి, 35 టీఎంసీలు కర్ణాటకకు, 24 టీఎంసీలు మహారాష్ట్రకు కేటాయించింది. ఏపీకి మొత్తం 811 టీఎంసీలు అయ్యింది.
మూడు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల కేటాయింపు పూర్తికాగానే అప్పటి సీమాంధ్ర పాలకు లు కుట్రలకు తెరతీశారు. ప్రణాళికాబద్దంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిని మెల్లగా కృష్ణా బేసిన్ అవతల ఉన్న పెన్నా బేసిన్లోకి తరలించడం ప్రారంభించారు. తెలంగాణలోని కృష్ణా బేసిన్ అవసరాలు తీర్చకుండా చెన్నైకి తాగునీటి పేరుతో 1,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో శ్రీశైలం నుంచి మొదలైన జలచౌర్యం పెరుగుతూ ఇప్పుడు 75,000 క్యూసెక్కులకు చేరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే శ్రీశైలం నుంచి తరలించే నీటి పరిమాణం రోజుకు 10 టీఎంసీలకు పైగా ఉంటుంది.
ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సముద్ర మట్టానికి 797 ఫీట్ల వద్ద రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే ఇప్పటికే రోజుకు 7 టీఎంసీల నీటిని దోచుకుపోతున్న ఏపీ.. మరో 3 టీఎంసీల నీటిని అదనంగా తరలించుకుపోతుంది. అంటే రోజుకు 10 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు నుంచి ఏకంగా కృష్ణా నదినే తరలించుకుపోయేలా కుట్రపన్నారు.