వరంగల్ అర్బన్ : ట్రై సిటీ పరిధిలో ఇకపై లాక్డౌన్ సమయాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లఘించిన వారిని గుర్తించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వాహనాలను గుర్తించేందుకుగాను పోలీసులు డ్రోన్ కెమెరాలతో గస్తీ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇంతేజాగంజ్ పోలీసుల అధ్వర్యంలో తొలిసారిగా పోచమ్మ మైదాన్ జంక్షన్లో ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరా గస్తీ పనితీరును వరంగల్ సీపీ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వాహనాల పూర్తి వివరాలను సేకరించాల్సిన తీరుతెన్నులపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. ముఖ్య కూడళ్ళతో పాటు ప్రధాన రోడ్డు మార్గానికి అనుసంధానంగా ఉండే రోడ్డు మార్గాలపై వాహనదారుల కదలికలతో పాటు ప్రజల కదలికలను గుర్తించే విధంగా డ్రోన్ కెమెరాలను వినియోగించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా లాక్డౌన్ వేళ కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చే వాహనదారులను నియంత్రించేందుకు సీపీ తరుణ్ జోషి గల్లీల్లో పాటు ప్రధాన మార్గాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనీఖీలో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులతో పాటు 10 గంటల లోపు తమ కార్యాలయాలకు చేరుకోని ప్రభుత్వ ఉద్యోగులపై కోరడా ఝళిపించారు.ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా, వరంగల్ ఏసీపీ గిరికుమార్, ఇంతేజా గంజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఇంతేజా గంజ్ ఎస్ఐ స్వామి పాల్గొన్నారు.