కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా నేపథ్యంలో ‘బుర్జ్ ఖలీఫా’ నమూనాతో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. దానిని చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో కోల్కతా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘ప్రతి రోజూ రద్దీ పెరుగుతున్నందున, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి మండపాన్ని ప్రజలు సందర్శించకుండా ఆపేందుకు పోలీసులు, పూజ కమిటీ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నది. ఈ మండపాన్ని వర్చువల్గా తిలకించేందుకు అనేక ఏర్పాట్లు చేశాం’ అని రాష్ట్ర అగ్నిమాపక మంత్రి సుజిత్ బోస్ తెలిపారు.
కాగా, బోస్కు చెందిన శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్, దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా ఆకాశ హర్మ్యాన్ని పోలిన దుర్గా పూజా మండపాన్ని నిర్మించింది. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా ఇది నిలువడంతో సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు ఈ మండపంలోకి ప్రజల ప్రవేశాన్ని నిలిపివేశారు.
మరోవైపు కోల్కతా ఎయిర్పోర్ట్కు సమీపంలో ఉన్న ‘బుర్జ్ ఖలీఫా’ మండపంలో లేజర్ షోను సోమవారం రద్దు చేశారు. లేజర్ షో వల్ల తమకు ఇబ్బందిగా ఉన్నదని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్కు ముగ్గురు పైలట్లు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల రద్దీని నియంత్రించేందుకు పలు రైళ్లను తూర్పు రైల్వే రద్దు చేసింది.