కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి బీజేపీ భారీగా ప్రకటనలు ఇస్తున్నది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25న కోల్కతాలోని పలు వార్తా పత్రికల్లో ప్రధాన మంత్రి అవాస్ యోజన గురించి ప్రకటనలు ప్రచురితమయ్యాయి. ‘ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ బెంగాల్’ శీర్షికతో ఉన్న ఈ ప్రకటనలో ప్రధాని మోదీ ఫోటోతోపాటు పథకం లబ్ధి పొందిన ఒక మహిళ ఫోటో ఉన్నది. ఈ కేంద్ర పథకం వల్ల తల దాచుకునేందుకు ఒక ఇల్లు తనకు సమకూరినట్లు ఆ ప్రకటనలో ఆ మహిళ పేర్కొంది.
కాగా, ఈ ప్రకటనలో ఉన్న మహిళ కోల్కతాలోని బౌబజార్ ప్రాంతంలోని మలంగా లేన్లో నివసిస్తున్న లక్ష్మి దేవిగా ఇండియా టుడే టీవీ గుర్తించింది. ఆ టీవీ జర్నలిస్ట్ అక్కడకు వెళ్లి ఆమెతో మాట్లాడగా షాకింగ్ విషయాన్ని చెప్పింది. ప్రకటనలో పేర్కొన్నది వాస్తవం కాదని తెలిపింది. ఆ ప్రకటనలో ఉన్న ఫొటో తనదేనని, కానీ ఎవరు ప్రచురించారో తనకు తెలియని చెప్పింది. తాను కేంద్ర పథకం ద్వారా ఎలాంటి ఇంటిని పొందలేదని లక్ష్మి దేవి తెలిపింది. ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి నెలకు రూ.500 చెల్లించి చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నట్లు ఇండియా టుడే టీవీ ప్రతినిధికి చెప్పింది. తమ పిల్లలు ఇంట్లో పడుకుంటే తాము రాత్రి వేళ ఫుట్పాత్పై నిద్రిస్తామని వెల్లడించింది. తమ ఇంటికి మరుగుదొడ్డి అయినా లేదని ఆమె పేర్కొంది.
కేంద్ర పథకం ద్వారా తమకు ఇల్లు సమకూరినట్లు వచ్చిన ఆ ప్రకటన అవాస్తవమని లక్ష్మి దేవి వెల్లడించింది. పత్రికల్లో వచ్చిన ప్రకటన గురించి పొరుగువారు తనకు చెప్పారని, అప్పుడే దాని గురించి తనకు తెలిసిందని చెప్పింది. ఆ ప్రకటనలో తన ఫొటో చూసి భయపడ్డానని, తన ఫొటో ఎవరు తీసుకున్నారో తెలియదని అన్నది. బాబుఘాట్ వద్ద మేళాలో టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నప్పుడు ఆ ఫొటోను తన అనుమతి లేకుండా ఎవరో తీశారని చెప్పింది. తనకు చదువు రాదని, దీని గురించి బీజేపీ కార్యాలయాన్ని ఎప్పుడూ సంప్రదించలేదని ఆమె తెలిపింది.
మరోవైపు దీనిపై స్పందన కోసం స్థానిక బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ను ఇండియా టుడే టీవీ ప్రతినిధి సంప్రదించగా మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.