కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్య అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు. భవానీపూర్తో పాటు పశ్చిమబెంగాల్లోని షంషేర్గంజ్, జాంగీర్పూర్ అసెంబ్లీ స్థానాలకు.. ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ స్థానానికి కూడా ఈ నెల 30న ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా తృణమూల్ నుంచి బీజేపీలోకి వెళ్లి బీజేపీ తరఫున బరిలో దిగిన సువేందు అధికారిని ఓడించడమే లక్ష్యంగా ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో మమతాబెనర్జి కేవలం 1900 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం మెజారిటీ స్థానాలు సాధించింది. దాంతో ఎమ్మెల్యేగా ఓడిపోయినా మమతాబెనర్జి సీఎం పదవిని స్వీకరించారు. ఆ పదవిలో కొనసాగాలంటే ఆమె ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. అందుకే ఇప్పుడు భవానీపూర్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.