Babanipur | తన కదలికలను కోల్కతా పోలీసులు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నారని భవానీపూర్లో బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆమె తరఫు ఎన్నికల ఏజెంట్ గురువారం భవానీపూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు. కొంత మంది కోల్కతా పోలీసులు సివిల్ డ్రస్ల్లో తమ ప్రచారంలో పాల్గొంటున్నారని ఆరోపించారు. ఎప్పటికప్పుడు తన కదలికలను ఫొటోలు తీసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి పంపుతున్నారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రచారంలో కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించడం లేదని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు మమతా బెనర్జీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తన ఎన్నికల అఫిడవిట్లో సమాచారం దాచిపెట్టారని ఇంతకుముందు దాఖలు చేసిన ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది.
ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్కు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీస్ జారీ చేసింది. నామినేషన్ దాఖలు సమయంలో కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి భారీగా మద్దతుదారులను సమీకరించారన్న అభియోగంపై ఆమెకు నోటీసులిచ్చింది. టిబ్రేవాల్ కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి, ఎటువంటి అనుమతి లేకుండా 500 మందికి పైగా సమీకరించిందని టీఎంసీ ఆరోపణ.