దండేపల్లి, జూన్ 6 : కోటీశ్వరుడైనా..కూలీ అయినా…కాలే కడుపులో గుప్పెడు మెతుకులు పడకపోతే ప్రాణం విలవిల్లాడిపోతుంది. కుటుంబమంతా కరోనా వైరస్ బారిన పడితే వారి ఇంట్లో పరిస్థితి దయనీయంగా మారుతున్నది. సరైన ఆహారం దొరకక ఆకలితో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారికి పోషకాహారంతో పాటు మెడికల్ కిట్లు అందించి ‘మేమున్నాం’ అంటూ రెబ్బెన్పల్లికి చెందిన దాతలు అండగా నిలుస్తున్నారు.
సేవా కార్యక్రమాలకు దాతల సాయం..
కొవిడ్ రోగులకు ఆహారం, నిత్యావసర సరుకులను దండేపల్లి మండలం రెబ్బెన్పెల్లికి చెందిన ప్రైవేట్ లెక్చరర్ సిరికొండ రమేశ్ అందిస్తున్నారు. ఇందుకు గ్రామానికి సంగనభట్ల రాజేంద్రప్రసాద్ అమెరికాలో ఉంటూ సహకారం అం దిస్తున్నారు. గతేడాది లాక్డౌన్లోనూ రాజేంద్రప్రసాద్, అతని మిత్రులు సహకారంతో లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లోని పలువురు ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు అందించాడు. గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధులకు 38 రోజుల పాటు భోజనం అందించారు. ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో సేవలను మరింత విస్త్రృత పరిచాడు. దండేపల్లి మండలంలోని రెబ్బెన్పల్లి, ముత్యంపేట, నంబాల, కన్నేపల్లి, లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామాల్లో ఏప్రిల్ 28 నుంచి 120 మంది కరోనా బాధితులకు రెండు పూటలా భోజనం అందించి ఆకలి తీరుస్తున్నాడు.
రోజూ 120 మందికి ఆహారం..
ప్రస్తుతం ఎక్కడ చూసినా కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు కరోనా బారిన పడిన వారు కనిపిస్తున్నారు. వంట చేసుకోలేక మంచానికే పరిమితమైన వారున్నారు. అలాంటి వారికి ప్రతి రోజూ రూ.10 వేల సుమారు 120 రోగులకు ఆహారాన్ని రమేశ్ అందిస్తున్నారు. రమేశ్కు ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్న లాస్య, సీఏగా చేస్తున్న తమ్ముడు రాకేశ్, తల్లి లక్ష్మి వంట తయారు చేయడంలో సహకారం అందిస్తున్నారు. 6, 9 ఏళ్ల వయస్సు గల చిన్నారులు సహస్ర, శ్రేష్ట కూడా సాయం అందించడం విశేషం. ప్రతి రోజూ వేకువజామునే లేచి పిల్లాపాపలతో కలిసి వంట తయారు చేయగా, రమేశ్ ఒక్కడే 5 గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై ఇంటింటా తిరుగుతూ కొవిడ్ బాధితుల ఆకలి తీరుస్తున్నాడు. మెడికల్ కిట్లు ఇస్తూ(మందులు, శానిటైజర్లు మాస్కులు) వారికి తగు సూచనలు అందిస్తున్నాడు.
కొవిడ్ బాధితులకు అందించే మెనూ..
కొవిడ్ బాధితులకు అందించే భోజనంలో పౌష్టికాహారం ఉండేలా చూస్తున్నారు. వారంలో మూడుసార్లు ఎగ్ బిర్యాని, మరో నాలుగు రోజులు కూరగాయలతో కూడిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. రోజుకు రెండు, మూడు రకాల కూరలు, సాంబారు, మజ్జిగ లాంటివి ఇస్తున్నారు. ప్రతి రోజూ అరటిపండ్లు, వాటర్మిలన్లు, డ్రై ఫ్రూట్స్ అందిస్తున్నారు. వంటలు అయిన తరువాత వాటిని ప్యాకెట్లుగా తయారుచేసి ఉదయం 11 గంటలలోపు బాధితుల ఇండ్లకు వెళ్లి ఇస్తున్నాడు. కరోనా బాధితుల హోం క్వారంటైన్ అయ్యే వరకు ఏ లోటు రానియ్యకుండా చూస్తున్నాడు.