ముంబై : స్టేజీపై కీర్తనలు పాడుతూ ప్రాణాలు వదిలారు కీర్తంకర్ తాజుద్దీన్ బాబా. ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో స్టేజీపైనే కుప్పకూలారు. మహారాష్ట్ర జాల్నా జిల్లా బోధ్లాపూర్కు చెందిన బాబా.. సక్రి తాలూకాలోని నిజాంపూర్ సమీపంలోని జామ్దాకు సోమవారం భజన కోసం వెళ్లారు. సోమవారం (ఈ నెల 27) రాత్రి గ్రంథరాజ్ జ్ఞానేశ్వరి మహారాజ్ పారాయణ్ సప్తహ్కు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఆయన కీర్తనలు ఆలపించడం ప్రారంభించారు. తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు.
చికిత్స కోసం నందూర్బార్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. కీర్తంకర్ తాజుద్దీన్ బాబా పుట్టుకతోనే ముస్లిం అయినప్పటికీ.. ఆయన వార్కారీ జీవనశైలిని అవలంభించారు. ప్రతి నిత్యం హరిపత్, భజనలకు హాజరయ్యే వారు. హిందూ- ముస్లిం మధ్య విభేదాలను తొలగించి, ప్రజల్లో అవగాహన కలిగించేలా ఆయన ప్రదర్శనలు ఇస్తుంటారు. బాబాకు హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. భజనలు చేస్తూ బాబా కుప్పకూలడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. పలువురు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.