కిన్నౌర్: హిమాచల్ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. శుక్రవారం ఉదయం మరో రెండు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. దీంతో మృతులు 15కు చేరారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. బుధవారం మధ్యాహ్నం కిన్నౌర్ జిల్లాలోని నిగుల్సేరి ప్రాంతంలో ఎన్హెచ్-5పై కొండచరియలు విరిగి వాహనాలపై పడిన విషయం తెలిసిందే. పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు దూసుకొచ్చి.. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుతోపాటు ఇతర వాహనాలపై పడ్డాయి. దీంతో ఆర్టీసీ బస్సు రోడ్డుపై నుంచి కొట్టుకుపోయి లోయలో పడిపోయింది.
ఈ ఘటనలో అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 4 గంటలకే ఎన్డీఆరెఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 40 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.