న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా కంపెనీలు నకిలీ ఖాతాలపై ఫిర్యాదు అందిన 24 గంటల్లో వాటిని తొలగించాలి. ప్రముఖ వ్యక్తులు, వ్యాపారవేత్తలు, సాధారణ సబ్స్క్రైబర్ల ఫేక్ ప్రొఫైల్ పిక్చర్లతో ఏర్పాటైన ఖాతాలనూ తొలగించి 24 గంటల్లో యూజర్కు నివేదించాలి. ఈ నిర్ణయంతో భారత్లో సోషల్ మీడియా వేదికగా నకిలీల బెడద తప్పుతుందని భావిస్తున్నారు.
ఈ నిబంధన ద్వారా సినీ నటులు, క్రికెటర్లు, రాజకీయ నేతలు ఇతర సెలబ్రిటీలు ఎవరైనా ఇతరులు ఫాలోయర్లను పెంచుకునేందుకు తమ ఫోటోలను వాడుతున్నారని గమనిస్తే ఆయా ఖాతాలను తొలగించాలని సోషల్ మీడియా కంపెనీలను కోరవచ్చు. తాజా నిబంధనల ప్రకారం సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలను పోలిన నకిలీ ఖాతాల బెడద నుంచి ఉపశమనం లభించనుంది. నేరపూరిత, మోసగించే ఉద్దేశాలతోనూ ఇలాంటి ఖాతాలను తెరుస్తున్నారు. వీటిలో కొన్ని ఖాతాలను ప్రముఖ వ్యక్తుల ఫ్యాన్స్ నిర్వహిస్తుండగా, మరికొన్ని బోట్స్ ద్వారా నడుస్తున్నాయని తాజా ఐటీ నిబంధనలతో వీటికి నియంత్రణ లభించడం ఊరట కలిగించే పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు.