తిరువనంతపురం: పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధన ధరల పెరుగుదలపై ఒక రాజకీయ నేత వినూత్నంగా నిరసన తెలిపారు. సుమారు నెలన్నర రోజులపాటు కాలినడకతో 14 జిల్లాల్లో ప్రయాణించారు. కరోనా పరిస్థితులతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచడాన్ని కేరళ యూత్ కాంగ్రెస్ నాయకుడు అబిన్ తమరసేరి సహించలేకపోయారు. దీనిపై నిరసనగా జూలై 20 నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కాసరగోడ్ నుండి తిరువనంతపురం వరకు కాలినడకన ప్రయాణించారు. బుధవారం అక్కడకు చేరుకున్న అబిన్కు యూత్ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. కేరళ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గవర్నర్, సీఎం దృష్టికి తీసుకెళ్తారని ప్రతిపక్ష నేత సతీసన్ తెలిపారు.
కాగా, జూలై 20న కాసర్గోడ్ నుంచి తన నిరసన పాదయాత్రను ప్రారంభించినట్లు అబిన్ తమరసేరి చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కేరళలోని 14 జిల్లాలను కవర్ చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసినట్లు వివరించారు. గవర్నర్, సీఎం, ప్రతిపక్ష నేతకు వీటిని పెన్ డ్రైవ్లో అందజేస్తానని అబిన్ వెల్లడించారు.