తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. బుధవారం రికార్డుస్థాయిలో 41,953 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటగా మొత్తం మరణాల సంఖ్య 5,565కు చేరింది. ఇప్పటి వరకు 13,62,363 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం 3,75,658 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మరోవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని మోదీకి బుధవారం లేఖ రాశారు. వెయ్యి టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, 50 లక్షల డోసుల కోవిషీల్డ్, 25 లక్షల కోవాగ్జిన్ డోసులను సరఫరా చేయాలని కోరారు. కరోనా కేసులపరంగా దేశంలోనే అత్యధిక క్రియాశీలకంగా కేరళ ఉన్నదని, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్, వెంటిలేటర్స్ను అందజేయాలని అభ్యర్థించారు.