తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత నెల రోజులుగా 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. అయితే గత నాలుగైదు రోజులుగా కరోనా కేసులు పది వేల లోపు నమోదయ్యాయి. తాజాగా రోజు వారీ కేసుల సంఖ్య మళ్లీ పది వేలు దాటింది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 11,079 కరోనా కేసులు, 123 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,20,698కు, మొత్తం మరణాల సంఖ్య 26,571కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 19,745 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 46,95,904కు చేరుకున్నదని, ప్రస్తుతం రాష్ట్రంలో 97,630 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతున్నది.