తిరుమలగిరి, మే 5 : ఉడుతల వేట బాలుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన తిరుమలగిరి మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుందరయ్య కాలనీకి చెందిన రావుల సంజీవ, ఉమారాణి దంపతుల కుమారుడు రావుల గణేశ్(14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సరదాగా ఉడుతలు పట్టడానికి మంగళవారం సాయంత్రం వల తీసుకొని ఇంటి నుంచి బయలు దేరాడు. సమీపంలో దట్టమైన చెట్లతో నిండిన వ్యవసాయ బావి వద్దకు చేరుకొని చెట్లపై ఉడుతలను ఆన్వేషిస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడు. రాత్రి వరకు బాలుడు ఇంటికి రాక పోవడంతో తల్లిదండ్రులు చుట్ట్టు పక్కల వెతికారు. బావి వద్ద ఉడుతలు పట్టే వల చేతి సంచి కనిపించడంతో బోరున విలపిస్తూ పోలీసులకు సమాచారం అందజేశారు. రాత్రి వెతికినా ఫలితం లేక పోవడంతో బుధవారం తెల్లవారుజామున పోలీసులు, ఫైర్ సిబ్బంది బావిలో గాలించి బాలుడి మృతదేహన్ని వెలికితీశారు. ఉన్న ఒక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా దవాఖానకు తరలించారు.