పుణె: మూడో వన్డేలో ఇంగ్లాండ్ స్పిన్నర్లు కళ్లుచెదిరే బంతులతో ఆతిథ్య బ్యాట్స్మెన్ను ఇబ్బందిపెడుతున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్లోని మూడు వికెట్లను స్పిన్నర్లే పడగొట్టారు. ముందుగా అదిల్ రషీద్ వరుస ఓవర్లలో ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను ఔట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ(7)ని మొయిన్ అలీ బౌల్డ్ చేసి భారత్కు షాకిచ్చాడు.
ఈ మ్యాచ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్ బాది ఫుల్ జోష్లో ఉన్న కోహ్లీ వేగంగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. ఒక దశలో 103/0తో పటిష్టంగా ఉన్న భారత్ ప్రత్యర్థి స్పిన్నర్ల దెబ్బకు 121/3తో ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం రిషబ్ పంత్(18), కేఎల్ రాహుల్(5) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 22 ఓవర్లకు టీమ్ఇండియా 141/3తో నిలిచింది.