తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ కేసులు బయటపడడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక వేసింది. ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి .. జిల్లా వైద్యాధికారులతో భేటీ నిర్వహించారు. గర్భిణి స్త్రీలకు జికా పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గర్భం దాల్చిన అయిదు నెలల మహిళలందరికీ జికా పరీక్షలు చేపట్టాలని సూచించారు. జికా వైరస్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. జికా వైరస్ సాధారణంగా గర్భిణులకు సోకుతోంది. దోమకాటు వల్ల ఆ వైరస్ సంక్రమిస్తున్న విషయం తెలిసిందే.
జికా వైరస్ సోకిన గర్భిణులకు పుర్రె లోపంతో ఉన్న పిల్లలు పుడుతారు. ప్రస్తుతం కేరళలో నమోదు అయిన కేసులో మాత్రం డెలివరీ నార్మల్గా ఉందని అధికారులు చెప్పారు. కానీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్న నేపథ్యంలో ఆ వైరస్ను కట్టడి చేసేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను ఆ రాష్ట్రం అమలు చేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు.
ఇప్పటి వరకు కేరళలో 15 మందికి జికా వైరస్ సంక్రమించింది. పగటి పూట కుట్టే ఎడిస్ దోమల వల్ల జికా సోకుతుంది. లైంగిక సంబంధం వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చాలనుకుంటున్న మహిళలు.. దోమకాటుకు దూరంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ తన ప్రకటనలో సూచించింది.