రెండేళ్లలోనే ఆదర్శంగా మారిన గ్రామం
టౌన్ను తలపించేలా అభివృద్ధి
డబుల్ రోడ్లతో సెంట్రల్ లైటింగ్
రాత్రిళ్లు హైమాస్ట్ వెలుగులు
మారుతున్న పల్లె స్వరూపం
కరీంనగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : పర్లపల్లి.. ఒకప్పుడు వెనుకబడిన గ్రామం. నిధుల కొరతతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. కానీ, నేడు పట్టణాలకు దీటుగా తయారైంది. సెంట్రల్ లైటింగ్తో రెండు వరుసల దారులు.. మధ్యలో అందమైన మొక్కలు.. చౌరస్తాల్లో లైట్లతో ఆదర్శంగా మారింది. ఇంకా ఆధునిక హంగులతో వైకుంఠధామం.. ఆహ్లాదం పంచే ప్రకృతివనం.. చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చే సెగ్రిగేషన్ షెడ్డు.. నూతనంగా నిర్మితమవుతున్న పంచాయతీ కార్యాలయం.. అందమైన రైతువేదిక.. ఇలా పల్లె ప్రగతి స్ఫూర్తితో సకల వసతులు సమకూర్చుకుని అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది.
తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామ అభివృద్ధికి 30 రోజుల ప్రణాళికతోనే పునాదులు పడ్డాయి. ఇరుకుగా ఉన్న రోడ్లను వెడల్పుగా మార్చేందుకు పంచాయతీలో తీర్మానించి, మొదట రోడ్లకు అడ్డుగా ఉన్న శిథిలమైన ఇండ్లను తొలగించారు. ఇరువైపులా ఉన్న ఇంటి యజమానుల అనుమతి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామమైన ఎర్రవెల్లి స్ఫూర్తితో స్థానిక సర్పంచ్ మాదాడి భారతి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు నిరంతరం కృషి చేశారు. ఫలితంగా గ్రామంలో ప్రగతి పరుగులు పెట్టగా, గ్రామస్తుల స్ఫూర్తిని సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు. ఈ గ్రామానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడంతో వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుంటున్నారు.
అన్ని పనులూ స్ఫూర్తిదాయకమే..
గ్రామంలో రోడ్ల వెడల్పు, డివైడర్లు, సెంట్రల్ లైటింట్ సహా అన్ని పనులూ మరో గ్రామానికి స్ఫూర్తినిచ్చేవిగా ఉన్నాయి. గ్రామం ప్రారంభంలోనే ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి వచ్చింది. శివారులో చెరువు కట్టను ఆనుకుని 12.60 లక్షలతో నిర్మిస్తున్న వైకుంఠధామం దాదాపుగా పూర్తయింది. ఊరికి దూరంగా బొమ్మలగుట్ట వద్ద డంప్ యార్డు ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా 2.50 లక్షలతో సెగ్రిగ్రేషన్ షెడ్డును నిర్మించారు. పెద్దమ్మ తల్లి ఆలయం నుంచి మహాత్మానగర్ మీదుగా ఎల్లమ్మ ఆలయం వరకు గ్రామం చుట్టూ బైపాస్ రోడ్డు వేస్తున్నారు. గ్రామం నుంచి పీచుపల్లి, రేకొండకు వెళ్లే రోడ్లను పునర్నిర్మిస్తున్నారు. 22 లక్షలతో రైతు వేదికను అందుబాటులోకి తెచ్చారు. దాని పక్కనే కొత్తగా రెండంతస్తుల్లో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 20 కొత్త స్తంభాలు వేశారు. 389 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. రెండేళ్లలో 20 వేల మొక్కలు నాటి దాదాపుగా బతికించుకున్నారు. 3,870 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో మాదాడి భారతిని సర్పంచ్గా ఏకగ్రీవం చేసి గ్రామ స్ఫూర్తిని చాటారు. గ్రామం అన్నింటా దూసుకెళ్తుండగా, గత జనవరి 26న మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీగా అవార్డు అందుకున్నారు.
కలిసి కట్టుగా పనిచేసుకుంటున్నం
రాజకీయాలు పక్కన బెట్టి గ్రామాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసు కుంటున్నం. ఇన్నేళ్లలో జరగని అభివృద్ధి రెండేళ్లలో జరుగుతున్నది. ఒకప్పుడు మా గ్రామం రాజకీయాలకు పెట్టింది పేరు. ఇప్పుడు అభివృద్ధికి పెట్టింది పేరుగా మారుతున్నది. చాలా గ్రామాలకు ఆదర్శంగా నిలువబోతున్నది. ఇప్పటికే చాలా గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి వెళ్తున్నరు.
సీఎం కేసీఆరే మాకు స్ఫూర్తి
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో ఏ విధంగా ప్రజలను చైతన్యం చేసి అభివృద్ధి సాధిస్తున్నారో గమనించినం. సీఎం స్ఫూర్తితో మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నం. దానికి తగినట్లుగానే అనేక శాఖల నుంచి నిధులు సాధించుకున్నం. గ్రామాలు పట్టణాల లెక్క తయారు కావాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా మా ఊరును తీర్చిదిద్దుకుంటున్నం. ఇందుకు గ్రామస్తులు, మా పాలకవర్గంతోపాటు ఎంపీటీసీ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉన్నది.