గెలల ధర నిర్ణయంలో ఆయిల్ఫెడ్
భారీగా పెరిగిన ఆయిల్పాం గెలల ధర
టన్ను రూ.18,384కు చేరిక
మే నెలకు రూ.1,020లు పెంపు
ఆనందంలో పామాయిల్ రైతులు
అశ్వారావుపేట, మే 1: పామాయిల్ గెలల ధర ప్రకటించడంలో ఆయిల్ఫెడ్ మరో సరికొత్త ఆల్టైం రికార్డులను నమోదు చేసుకుంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆయిల్పాం గెలల ధర పెరుగుతూనే ఉంది. మే నెలకు ఏకంగా టన్ను గెలల ధరను రూ.1,020కు భారీగా పెంచింది. గత నెలతో పోల్చితే ఈ నెల ధర రూ.18,384కు చేరింది. అత్యధిక ధర చెల్లించడంతో ఆయిల్పాం రైతులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
రైతుల ఆశించిన ధర కంటే ఆయిల్ఫెడ్ సంస్థ రైతులకు ఆయిల్పాం గెలల ధరను ఎక్కువగానే ప్రకటిస్తోంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అందించని ధరను టీఎస్ ఆయిల్ఫెడ్ చెల్లిస్తోంది. గత నెలతో పోల్చితే మే నెలకు గాను టన్ను గెలల ధర ఏకంగా రూ.1,020 పెంచి రూ.18,384గా ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో టన్ను గెలల ధర రూ.14,416 ఉండగా ఫిబ్రవరి నెలకు రూ.15,147కు చేరింది. మార్చిలో ఈ ధర మరింత పెరిగి రూ.15,923కు ఎగబాకింది. అంతటితో ఆగక ఏప్రిల్లో ఆ ధర అమాంతం రూ.17,264కు చేరింది. ఇప్పడు మే నెలకు టన్నుకు రూ.1,020 పెంచిన ఆయిల్ఫెడ్ అధికారులు మొత్తాన్ని రూ.18,384గా ప్రకటించారు. శనివారం గెలల ధరను నిర్ణయించి రైతులకు సమాచారం విడుదల చేశారు. దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్పాం సాగు రైతులకు ఆర్థిక దన్నుగా నిలుస్తోందని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఇదేవిధంగా కనీస మద్దతు ధర కొనసాగితే ఇతర వర్గాల రైతులు సైతం ఆయిల్పాం సాగు వైపు మొగ్గు చూపుతారని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కల సాకారం దశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమానికి ఆయిల్పాం సాగు తోడ్పాటుగా నిలవటమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఆయిల్పాం హబ్గా రూపుదిద్దుకుంటుందని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు నల్గొండ జిల్లాలోని కొంతభాగంలోనే సాగవుతున్న ఆయిల్పాం పంటను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ఆయిల్ఫెడ్ అధికారులు పక్కా ప్రణాళిక అమలుచేస్తోంది.
ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడ్పాటునందిస్తోంది. ఇప్పటికే ఎంపిక చేసిన జిల్లాలో సాగు విస్తరణను టీఎస్ ఆయిల్ఫెడ్తోపాటు కొన్ని ప్రైవేట్ కంపెనీలు వేగవంతం చేశారు. ఆయా జిల్లాలను ఆయిల్ఫెడ్తోపాటు ప్రైవేట్ కంపెనీలకు ఉద్యాన శాఖ ఇప్పటికే కేటాయింపులు పూర్తి చేసింది. పెరుగుతున్న సాగు వ్యయం దృష్ట్యా టన్ను గెలల ధర కనీసం రూ.10 వేలకు తగ్గకుండా చెల్లించాలని రైతులు కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఇప్పడు డిమాండ్కు మించి అత్యధిక ధర అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.20 వేలకు చేరువలో గెలల ధర చెల్లిస్తున్న టీఎస్ ఆయిల్ఫెడ్కు, ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పెరిగిన ధర మే నెలకు రైతులు ఫ్యాక్టరీకి తరలించిన గెలలకు మాత్రమే అందిస్తామని టీఎస్ ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జనరల్ మేనేజర్ టీ.సుధాకర్రెడ్డి తెలిపారు.