కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్, బెంగాలీ సినిమాకు దాదా వంటి మిధున్ చక్రవర్తికి కాషాయ పార్టీ మంగళవారం విడుదల చేసిన తుదిజాబితాలో చోటు దక్కలేదు. రష్బెహరి సీటు నుంచి మిధున్ చక్రవర్తిని బీజేపీ బరిలో దింపుతుందని భావించినా జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. 13 మంది అభ్యర్ధుల పేర్లతో బీజేపీ విడుదల చేసిన తుది జాబితాలో మిధున్ చక్రవర్తి పేరు లేకపోవడం ఆయన అభిమానులను నిరాశపరిచింది. రష్బెహరి స్ధానం నుంచి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రత సాహ అభ్యర్ధిత్వాన్ని బీజేపీ ఖరరారు చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీతో ఈనెల 7న కోల్కతాలో జరిగిన ర్యాలీలో మిధున్ చక్రవర్తి పాల్గొన్న క్రమంలో ప్రతిష్టాత్మక దక్షిణ కోల్కత స్ధానం నుంచి ఆయన బరిలో ఉంటారని గతంలో బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన ముంబై నుంచి తన ఓటును కోల్కతాకు మార్పించడం కూడా మిధున్ కోల్కతా నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు ఊతమిచ్చింది. మరోవైపు చివరి నిమిషంలో ప్రస్తుత అభ్యర్దిని మార్చి మిధున్ చక్రవర్తిని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బీజేపీ బరిలో దించే అవకాశాలూ తోసిపుచ్చలేమని పరిశీలకులు పేర్కొంటున్నారు.