తిరువనంతపురం : కొవిడ్-19 కేసుల విజృంభన నేపథ్యంలో రాష్ట్రానికి కనీసం వెయ్యి టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, 50 లక్షల డోసుల కోవిషీల్డ్ అదేవిధంగా 25 లక్షల కోవాగ్జిన్ డోసులను సరఫరా చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ కేరళ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం లేఖ రాశారు. కొవిడ్ కేసుల్లో కేరళ దేశంలోనే అత్యధిక క్రియాశీలక కేసుల్లో ఒకటిగా ఉందని వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని పీఎస్ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్, వెంటిలేటర్స్ను అందజేయాల్సిందిగా కోరారు.
టీకాల కోసం రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్యను, మొదటి డోస్ కోసం రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్యను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా విన్నవించారు. దీని ప్రకారం 50 లక్షల డోసుల కోవిషీల్డ్, 25 లక్షల కోవాగ్జిన్ డోసులను కేరళకు కేటాయించాల్సిందిగా అభ్యర్థిస్తున్నట్లు విజయన్ పేర్కొన్నారు.
కేరళలో మంగళవారం 37,190 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 26,148 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షలకు పైగా ఉండగా రికవరీలు 13.39 లక్షలుగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి.