న్యూఢిల్లీ, మే 5: కరోనా వ్యాక్సిన్ వృథాను అరికట్టడానికి కేరళ ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషిని ప్రధాని మోదీ అభినందించారు. మిగతా రాష్ర్టాలు కూడా కేరళ బాటలో నడువాలని సూచించారు. మంగళవారం కేరళ సీఎం పినరాయి విజయన్ ట్వీట్ చేస్తూ ‘కేంద్రం నుంచి 73,38,806 వ్యాక్సిన్ డోసులు రాష్ర్టానికి వచ్చాయి. అయితే ఒక వ్యాక్సిన్ సీసాను వాడినప్పుడు అందులో కొంతమొత్తం ఔషధం వృథాగా పోతుంది. దీనిని అరికట్టి మొత్తం డోసుల సంఖ్య 74,26,164కు పెరిగేలా చేశాం. వృథాను అరికట్టడంలో ఆరోగ్య సిబ్బంది కృషిని మరువలేం’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్పై స్పందించిన ప్రధాని ‘చూడండి.. కేరళకు చెందిన మన ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ వృథాను ఎలా అరికట్టారో.. కరోనాపై పోరులో వ్యాక్సిన్ వృథాను అరికట్టడమూ భాగమే’ అని తెలిపారు.