తిరువనంతపురం: దేశ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకాలు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని ఇవాళ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దేశ ప్రజలందరికీ సరిపడా వ్యాక్సిన్లు అందే విధంగా కేంద్ర ప్రభుత్వమే గ్లోబల్ టెండర్లు వేయాలని కూడా ఆ తీర్మానంలో కోరారు. దేశంలో ఓ రాష్ట్ర అసెంబ్లీ ఇలా తీర్మానం పాస్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ప్రమాదకరమైన అంటువ్యాధులను నియంత్రించేందుకు జాతీయ వ్యాక్సిన్ విధానం ఉండేదని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. పాత విధానాలను విస్మరిస్తూ కేంద్రం కొత్త పంథాలో వెళ్తోందని, ఉచిత టీకాలు ఇవ్వడానికి బదులుగా.. మార్కెట్ నుంచి టీకాలు కొనుగోలు చేసుకోవాలని రాష్ట్రాలనే ఆదేశిస్తోందని, దీన్ని ఖండిస్తున్నామని ఆమె తీర్మానం చదువుతూ అన్నారు. పబ్లిక్ సెక్టార్లో ఉన్న కంపెనీలు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానంలో కోరారు. వ్యాక్సిన్లపై ఖర్చు చేసే నిధులను వృధాగా వెళ్తున్నట్లు భావించరాదు అని, దీని వల్ల మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని మంత్రి వీణా జార్జ్ అన్నారు. వ్యాక్సినేషన్తోనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమని, అందరికీ వ్యాక్సిన్లు అందాలంటే, అప్పుడు ఉచితంగా టీకాలు ఇవ్వాలని మంత్రి తెలిపారు.