తిరువనంతపురం: కేరళలో ఏప్రిల్ 6 జరుగున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి శనివారం మ్యానిఫెస్టో విడుదల చేసింది. శబరిమల సంప్రదాయం పరిరక్షణకు ప్రత్యేక చట్టం, 40-60 ఏండ్ల గృహిణులకు నెలకు రూ.2,000 పెన్షన్, తెల్లకార్డుదారులకు ఉచితంగా ఐదు కిలోల బియ్యం, పేదలకు ఐదు లక్షల ఇండ్లు వంటి హామీలు ఇచ్చింది.
సంతోషం మంత్రిత్వశాఖ, రాజస్థాన్ నమూనా మాదిరిగా శాంతి, సామరస్యం విభాగం ఏర్పాటు, పెట్టుబడిదారుల రక్షణ చట్టం, బలవంతపు బంద్లపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు హాజరయ్యే తల్లులకు వయసులో రెండేండ్లు మినహాయింపు, కరోనా బాధితులకు ఆసుపత్రి ఖర్చులు, ఉచితంగా ఆహారం కిట్, సామాజిక భద్రత పెన్షన్ రూ.1,600 నుంచి రూ.2,500కు పెంపు వంటివి తమ మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్లు యూడీఎఫ్ తెలిపింది.