హైదరాబాద్ : కొత్తగా నియామకమైన పంచాయతీ కార్యదర్శుల వేతనాలను, ప్రస్తుతం పని చేస్తున్న కార్యదర్శుల వేతనాలకు సమానంగా పెంచుతున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్కు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కొత్తగా నియామకమైన 9,355 మంది కార్యదర్శులకు సమాన పనికి సమాన వేతనంగా ఇప్పుడున్న జీతాలకు రెట్టింపు కంటే ఎక్కువ జీతాలు వస్తాయన్నారు.
గత కొంత కాలంగా కొత్త గ్రామ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్న డిమాండ్ సీఎం హామీతో నెరవేరిందన్నారు. ప్రొబేషనరీ పిరియడ్ ని నాలుగేండ్లకు పెంచడానికి గల కారణాలను కూడా సీఎం తెలిపారన్నారు. కార్యదర్శులు మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని మంత్రి కోరారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతానికి గ్రామ కార్యదర్శుల పనితనమే కారణమన్నారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంలో రాజీ లేకుండా గతంలో మాదిరిగానే కరోనా కట్టడికి పూర్తి క్రమశిక్షణతో పని చేయాలన్నారు.