న్యూఢిల్లీ : ఢిల్లీ రేషన్ స్కీమ్ వ్యవహారం ఆప్, బీజేపీల మధ్య రాజకీయ రగడకు కేంద్రబిందువైంది. ఢిల్లీ ప్రభుత్వం రేషన్ మాఫియా గుప్పిట్లో ఉందని, కేజ్రీవాల్ ఇంటింటికీ రేషన్ పధకం పనికిమాలినదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించడంతో ఆప్ సర్కార్ దీటుగా బదులిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాలా కలిసి పనిచేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఇక ఇంటింటికీ రేషన్ అందించే పధకం పట్ల కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తప్పుపట్టారు. బీజేపీ కాస్తా భారతీయ జగడాల పార్టీగా తయారైందని దుయ్యబట్టారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేయడం మినహా ప్రజల మేలు కోసం ఏమీ చేయడం లేదని ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో విఫలమైన కేజ్రీవాల్ ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీపై మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు.