న్యూఢిల్లీ : సింగపూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ నూతన స్ట్రెయిన్ పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ లో కొవిడ్-19 థర్డ్ వేవ్ వ్యాప్తిలో సింగపూర్ కొవిడ్ స్ట్రెయిన్ విరుచుకుపడవచ్చని పేర్కొన్నారు. సింగపూర్ నుంచి విమాన రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని, చిన్నారులకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
సింగపూర్ స్ట్రెయిన్ చిన్నారులకు ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారని, ఇది థర్డ్ వేవ్ రూపంలో భారత్ ను తాకవచ్చని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులను కాపాడుకునేందుకు మనం వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని ఆయన ట్వీట్ చేశారు.