న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదంటూ గతంలో తాను ఇచ్చిన తీర్పును సమీక్షించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ అంశంపై అభిప్రాయాలు తెలుపాలని ఇప్పటికే రాష్ర్టాలను కోరింది. అయితే కొన్ని రాష్ర్టాలు మరింత సమయం కోరినందున గడువును మరో వారం పొడిగించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని 1992లో ఇందిరా సహానీ కేసులో 11 మంది సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. దీనినే మండల్ తీర్పు అంటారు. అయితే మరాఠాలకు రిజర్వేషన్ కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకొన్నది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయి. ఈ నేపథ్యంలో మరాఠాలకు ప్రత్యేక కోటా ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది. దీంతో 50 శాతం పరిమితిని తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఈ నెల 8న ఐదుగురు జడ్జిలతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
బీసీ కమిషన్కు రాజ్యాంగప్రతిపత్తి కల్పించిన 102వ రాజ్యాంగ సవరణను సమీక్షించే అంశంపై కూడా సుప్రీంకోర్టు విచారణ చేస్తున్నది. ఓబీసీ రిజర్వేషన్లలో కీలకమైన ఈ సవరణను సమీక్షించాలో వద్దో అభిప్రాయాలు చెప్పాలని రాష్ర్టాలకు సుప్రీంకోర్టు ఇటీవలే నోటీసులు జారీచేసింది.
ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల కంటే నోటా (నన్ ఆఫ్ ది అబోవ్)కు ఎక్కువ ఓట్లు వస్తే, ఆ ఎన్నికను రద్దు చేసి.. కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి, ఈసీకి నోటీసులు జారీ చేసింది.