శ్రీనగర్ : ఉగ్ర సంస్ధ లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)నుంచి తనకు బెదిరింపులు ఎదురయ్యాయని జమ్ము కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హెచ్చరిస్తూ టీఆర్ఎఫ్ ప్రకటన జారీ చేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేశాయని రైనా తెలిపారు. ఉగ్రవాదుల హెచ్చరికల నేపధ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తనను జాగ్రత్తగా ఉండాలని నిఘా వర్గాలు కోరాయని చెప్పారు.
బీజేపీ ఎదుగుదల ఓర్వలేకనే ఉగ్రమూకలు పేట్రేగుతున్నాయని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఇటీవల ఉగ్రవాదులు చంపిన ఘటనను ఆయన ఖండించారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకే ఉగ్రవాదులు విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నెలలో ఉగ్రవాదులు బీజేపీ నేత జావీద్ అహ్మద్ దర్ను కుల్గాంలో దారుణంగా హత్య చేయగా వారం రోజుల వ్యవధిలోనే అనంతనాగ్లో గులాం రసూల్ దర్ను అంతమొందించారు.