బెంగళూరు: వ్యాక్సినేషన్ మూడో దశలో భాగంగా మే 1 నుంచి 18-44 ఏండ్ల వయసు వారికి ఉచితంగా టీకాలు వేసేందుకు కోటి డోసులను కొనుగోలు చేస్తామని కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప తెలిపారు. తొలి దశ టీకా కార్యక్రమం కోసం రూ.400 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 18 ఏండ్లు పైబడిన వారంతా ఈ నెల 28 నుంచి తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
మరోవైపు కర్ణాటకలో గత 24 గంటల్లో కొత్తగా 25,795 కరోనా కేసులు, 123 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 12,47,997కు, మొత్తం మరణాల సంఖ్య 13,885కు చేరింది. ప్రస్తుతం 1,96,236 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.