బెంగళూరు: ఊహించినట్లే కర్ణాటక కూడా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. కరోనా సెకండ్ వేవ్లో మొత్తం దేశానికి కొత్త కేంద్రంగా మారిన ఈ రాష్ట్రంలో రోజువారీ కేసులు 50 వేల వరకూ చేరుకున్నాయి. దీంతో ఈ నెల 10న (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 24 ఉదయం 6 గంటల వరకూ పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యెడ్యూరప్ప శుక్రవారం ప్రకటించారు. కరోనా కర్ఫ్యూ పెట్టిన పెద్దగా ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు. అన్ని హోటళ్లు, పబ్బులు, బార్లు మూసి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇక హోటళ్లు, మాంసం దుకాణాలు, కూరగాయల దుకాణాలు మాత్రం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ తెరిచి ఉంటాయని చెప్పారు.