బెంగళూర్ : మతమార్పిడి నిరోధక బిల్లును తీసుకువచ్చేందుకు కసరత్తు సాగిస్తున్నామని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ణానేంద్ర మంగళవారం వెల్లడించారు. ఈ తరహా చట్టాన్ని తీసుకువచ్చిన ఇతర రాష్ట్రాల్లో చట్ట నిబంధనలను పరిశీలించి బిల్లును ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. కర్ణాటకలో మతమార్పిడులు ముమ్మరంగా సాగుతున్నాయని, తన తల్లి మతం మారి క్రైస్తవం స్వీకరించిందని ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్ పేర్కొన్న క్రమంలో మత మార్పిళ్లను నిలువరించేందుకు చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి తెలిపారు.
కాగా, తన తల్లికి కొందరు నూరిపోసి క్రైస్తవంలోకి మార్పించారని ఎమ్మెల్యే శేఖర్ చెప్పుకొచ్చారు. హోసదుర్గ నియోజకవర్గంలో క్రైస్తవ మిషనరీలు పెద్ద ఎత్తున మతమార్పిళ్లకు పాల్పడుతున్నాయని, దాదాపు 18,000 నుంచి 20,000 మంది వరకూ హిందువులను మిషనరీలు క్రైస్తవ మతంలోకి చేర్పించాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన తల్లి మతం మారేలా చేసిన మిషనరీలు ఆమెను నుదుటిపై కుంకుమ పెట్టుకోవద్దని కోరాయని చెప్పారు.
ఆమె ఫోన్ రింగ్టోన్ను కూడా క్రైస్తవ ప్రార్ధనలతో మార్చేశారని అన్నారు. ఇంట్లో పూజ చేయాలన్నా ఇబ్బందికరంగా ఉందని, తల్లికి ఏదైనా చెప్పినా ఆమె తనువు చాలిస్తానని అంటోదని ఆయన వాపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిళ్లపై మాజీ స్పీకర్ కేజీ బోపయ్య, ఎమ్మెల్యే దేవానంద్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.