వడోదర : లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఉంటే చాలు ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా లక్ష్యం చేరుకోవచ్చు. ఆమెకు చదవాలనే కోరిక బలంగా ఉండటంతో డాక్టరేట్ సాధించే వరకు పట్టుదలతో ముందుకు సాగింది. కోడలి సాయంతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి.. 67 ఏళ్ల వయసులో డాక్టరేట్ పట్టాను పుచ్చుకుంది.
ఉషా లోడయ(67) అనే మహిళకు 20 ఏళ్ల వయసులోనే వివాహమైంది. పెళ్లయ్యే సమయానికి ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు డాక్టర్ కావాలనే ఆశయం ఉండేది కానీ పెళ్లి కావడంతో.. అది సాధ్యం కాలేదు. తన లక్ష్యాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు చదువును కొనసాగించాలని చెప్పినప్పటికీ, కుటుంబ బాధ్యతలు ఆమెను అటు వైపు వెళ్లనివ్వలేదు. కానీ ఇప్పుడు డాక్టరేట్ సాధించడం సంతోషంగా ఉందని ఉషా పేర్కొన్నది.
పెళ్లైన కొన్ని సంవత్సరాలకు మహారాష్ట్రలోని శత్రుంజయ అకాడమీలో జైనిజంలో ఆన్లైన్ కోర్సు ఉన్నట్లు ప్రకటన చూసింది ఉషా. మొత్తానికి ఆన్లైన్ ద్వారా ఉషా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మాస్టర్స్ పూర్తి చేసింది. ఆమెకు మంచి మార్కులు రావడంతో పీహెచ్డీలో కూడా సీటు వచ్చింది. అలా కోడలు నిషా సహాయంతో అత్త ఉషా పీహెచ్డీ పూర్తి చేసింది అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఈ సందర్భంగా కోడలు నిషా మాట్లాడుతూ.. ఉషా అత్త రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు పుస్తకాలతో కుస్తీ పట్టేవారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె పీహెచ్డీ పూర్తి చేయగలిగారు. మామ ఈ లోకంలో లేకపోయినప్పటికీ.. ఆమె కుమారుడు చదువుకోమని నిరంతరం ప్రోత్సహించేవాడు. ఉషాకు తాను కోడలిని కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని నిషా తెలిపింది.