హైదరాబాద్ : నిమ్స్ మాజీ డైరక్టర్, ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. నిమ్స్ డైరక్టర్ గా ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. కాకర్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాకర్ల సుబ్బారావు.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. అనారోగ్యంతో బాధపడుతున్న కాకర్ల సుబ్బారావు నెల రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సుబ్బారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా పొందారు. 1951లో హౌస్ సర్జన్ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్, బాల్టిమోర్ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్గా సేవలందించారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా నిమ్స్ను తీర్చిదిద్దారు కాకర్ల. 2000 సంవత్సరంలో ఆయన పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు.
ఇవి కూడా చదవండి..