బెంగళూరు: కర్ణాటకలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. రోగులకు ఆసుపత్రిలో పడకలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి ప్రత్యేక చొరవ చూపారు. షిగ్గావ్లోని తన ఇంటి ప్రాంగణాన్ని కరోనా సంరక్షణ కేంద్రంగా మార్పు చేశారు. ఇందులో 50 పడకలు ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నవారికి ఇక్కడ వసతి, చికిత్స అందజేస్తామని ఆయన చెప్పారు. కర్ణాటకలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21.3 లక్షలు, మొత్తం మరణాల సంఖ్య 21 వేలు దాటింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.