హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి ఇంటిని సందర్శించనున్నది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. బీఆర్కేభవన్ నుండి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. మున్సిపల్ సిబ్బంది, ఏఎన్ఎంలతో పాటు కనీసం ఇద్దరు ఆశావర్కర్లతో బృందాలను ఏర్పాటు చేయాలని, ఈ బృందాలు ప్రతి ఇంటికి తిరిగి జ్వరం, తదితర లక్షణాలున్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు అందజేయాలని చెప్పారు. కరోనా రోగులను పరిశీలిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఈ బృందాలు పర్యవేక్షించాలని సూచించారు. వెంటనే ప్రతి ప్రభుత్వ దవాఖాన, పట్టణ ఆరోగ్యకేంద్రాలతో పాటు అన్ని బస్తీ దవాఖానల్లో ఔట్ పేషెంట్ క్లినిక్ కేంద్రాలను ప్రారంభించాలని, క్లీనింగ్ డ్రైవ్, వైట్వాషింగ్ చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్లను సీఎస్ ఆదేశించారు. అలాగే అన్ని సరిళ్లలో కొవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలని చెప్పారు. టెలికాన్ఫరెన్స్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, వైద్యవిద్య డైరెక్టర్ రమేశ్రెడ్డి, ప్రజారోగ్య డైరెక్టర్ జీ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.