కరోనా జాతీయ నిపుణుల కోర్కమిటీలో చోటు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనాపై జాతీయస్థాయిలో కేంద్రం ఏర్పాటుచేసిన నిపుణుల కోర్కమిటీలో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖాన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ గంగాధర్కు చోటు లభించింది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో కరోనా టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయనను కేంద్ర వైద్యారోగ్య శాఖ జాతీయ స్థాయిలోని 9 మంది నిపుణులతో ఏర్పాటుచేసిన కోర్ కమిటీలో సభ్యుడిగా నియమించింది. ఈ కమిటీ తొలి సమావేశం బుధవారం ఆన్లైన్లో జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ప్రొఫెసర్ సునీల్కుమార్ అధ్యక్షత వహించగా సభ్యులుగా ఉన్న ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీకి కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ సునీలా గార్గ్, రోహ్తక్కు చెందిన పీజీఐఎంఎస్ పల్మనరీ డిపార్ట్మెంట్ హెడ్ ధ్రువ్ చౌదరి, ఎయిమ్స్ ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్ నవీత్ విగ్, లక్నో కేజీఎంయూ ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్ వీరేంద్ర అటం, జైపూర్కు చెందిన ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సుధీర్ భండారీ, హైదరాబాద్ నిమ్స్ దవాఖాన నెఫ్రాలజీ హెడ్ డాక్టర్ టీ గంగాధర్, భోపాల్ గాంధీ మెడికల్ కాలేజీ పల్మనరీ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ లోకేంద్ర దేవ్ పాల్గొన్నారు.
చికిత్సపై మార్గదర్శనం
కరోనాతో హోం ఐసొలేషన్లో ఉన్నవారికి అందించాల్సిన చికిత్స మార్గదర్శకాలపై, ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వచ్చి కరోనా లక్షణాలు ఉన్నవారి పట్ల అనుసరించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు దేశంలోని వైద్యరంగానికి దిశానిర్దేశం చేస్తుంది. ఈ సమావేశంలో కొవిడ్ చికిత్సకు సంబంధించి ఎవరెవరికి చికిత్సను ఏ ప్రాతిపదికన అందించాలన్న అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా కొవిడ్కు సంబంధించి పూర్తి లక్షణాలతో ఉండి, దవాఖానలో చేరాల్సిన పరిస్థితిలో రోగులకు పరీక్ష కోసం వేచి చూడకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం, హోమ్ ఐసొలేషన్లో ఉన్న రోగుల ఆరోగ్య పరిస్థితిని తరుచూ సమీక్షించటం, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వచ్చి, కొవిడ్ లక్షణాలు ఉన్న రోగులకు చికిత్స కొనసాగించటం, జ్వరం, శ్వాస సంబంధ లక్షణాలు ఉన్న వారిని తక్షణం హోం ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందించాలి. హోం ఐసొలేషన్లో ఉన్నవారికి శ్వాస సమస్య వస్తే కొన్ని స్టెరాయిడ్లు ఇవ్వటం మొదలుపెట్టాలి అని తీర్మానించారు.