బెంగళూర్ : దవాఖానల్లో అనవసరంగా ఎక్కువ రోజులు గడిపే కొవిడ్-19 రోగులు సత్వరమే డిశ్చార్జి అవడం ద్వారా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్న వారికి అవకాశం కల్పించాలని కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. యడియూరప్ప మంగళవారం నగరంలోని కొవిడ్ వార్ రూమ్ ను సందర్శించిన అనంతరం మాట్లాడుతూ 332 మంది రోగులు 30 రోజులుగా దవాఖానలో ఉన్నారని, 503 మంది రోగులు 20 రోజులుగా దవాఖానలో చికిత్స పొందుతున్నారని..ఇలా అనవసరంగా దవాఖానలో ఉండే ప్రజలు ఇంటికి వెళ్లడం మంచిదని సూచించారు.
ఇంటి నుంచే చికిత్స పొందే వీలున్న రోగులు సైతం కొవిడ్ కేర్ సెంటర్లలో తిష్ట వేసి దవాఖానలో చికిత్స అవసరమైన రోగులకు బెడ్లు ఖాళీ లేని పరిస్థితి తీసుకువచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ వార్ రూమ్ తో దవాఖానల్లో బెడ్ల వివరాలు, ఆక్సిజన్ అందుబాటు, మందుల లభ్యత వంటి సమస్త సమాచారం లభ్యమవుతుందని చెప్పారు. దేశంలోనే ఆదర్శంగా కొవిడ్ వార్ రూంను కర్నాటక ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు.