పరకాల, మే 22: లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి రోడ్డుపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఏసీపీ పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్సైలతో లాక్డౌన్పై సమీక్ష నిర్వహించారు. అనంతరం పరకాల పట్టణంలోని బస్టాండ్ సర్కిల్లో డ్రోన్ కెమెరా ద్వారా లాక్డౌన్ను ఆయన పర్యవేక్షించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు మీదకు వచ్చిన ఎనిమిది వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వరంగల్ సీపీ తరుణ్జోషి ఆదేశాల మేరకు లాక్డౌన్ను కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అత్యవసర సేవలందిస్తున్న వాహనాలు, అనుమతి ఉన్న వాటిని తప్ప మిగిలిన వాహనాలు రోడ్ల మీదకు వస్తే సీజ్ చేస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. పరకాల డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1100 కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 10 గంటలలోపే తమ ఆఫీసులకు చేరుకోవాలని, అనుమతి పాస్లు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు.
నర్సంపేటలో..
నర్సంపేట : నర్సంపేటలో విజయవంతంగా లాక్డౌన్ కొనసాగుతున్నది. శనివారం పట్టణంలో బందోబస్తును డీసీపీ వెంకటలక్ష్మి పర్యవేక్షించారు. ధాన్యం కొనుగోలుకు, రోగులను దవాఖానలకు తరలించే వాహనాలను అనుమతించారు. అనుమతిలేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ లాక్డౌన్లో ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని సూచించారు. అత్యవ సరమైతే తప్ప రోడ్డుపైకి రావొద్దన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : స్థానిక ఎస్సై శీలం రవి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది లాక్డౌన్ను పర్యవేక్షించారు. శనివారం నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిపై అకారణంగా వచ్చిన 30 మంది వాహనదారులకు రూ..వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై మహేందర్, కానిస్టేబుళ్లు తిరుపతి, ఉపేందర్, రామకృష్ణ, క్రాంతికుమార్, రాము పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం : కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ అనవసరంగా రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని ఎస్సై సాయిబాబు అన్నారు. శనివారం మండల వ్యాప్తంగా ఆయన లాక్డౌన్ అమలును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతన్న 38 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశార.
శాయంపేటలో..
శాయంపేట : నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న ఎనిమిది వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ తోగిటి రమేశ్కుమార్, ఎస్సై అకినపెల్లి ప్రవీణ్కుమార్ తెలిపారు. వారు మాట్లాతూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు తమ అవసరాల కోసం బయటకు రావాలన్నారు. అనంతరం స్వీయనియంత్రణలో ఇళ్ల వద్ద ఉండాలని సూచించారు. 10 గంటల అనంతరం వాహనదారులు బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించచారు. ఈ కార్యక్రమంలో పీఎస్ఐ లవన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
సంగెంలో..
సంగెం : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 100 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై ఎం సురేశ్ తెలిపారు. మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ ఆదేశాల మేరకు పర్వతగిరి సీఐ పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని తీగరాజుపల్లి గ్రామ కూడలిలో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించామని ఎస్సై తెలిపారు. స్టేహోం స్టేసేఫ్, మాస్కులు ధరించండి, శానిటైజర్ వాడండి, అనవసరంగా బయటకు రాకండి, భౌతిక దూరం పాటించండి అనే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించాని ఆయన వివరించారు. కరోనా నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై తోట మహేంధర్, ఏఎసై వెంకన్న పాల్గొన్నారు.