గత రెండేళ్లుగా కోవిడ్ తో ప్రపంచం అల్లాడుతోంది. టీకాలతో పాటు మాస్క్ లను కూడా తప్పకుండా పెట్టుకోవాలని ఇప్పటికే ఆయాదేశాలు ప్రజలను ఆదేశించాయి. అయితే ఈ మాస్క్ లను వాడేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా సర్జికల్ మాస్క్ ల వల్ల ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయం కనుగొన్నాడు ఈ కుర్రాడు.
కర్నాటకు చెందిన నితిన్ వ్యాస్ ఎకో ఫ్రెండ్లీ మాస్క్ లను తయారుచేశాడు. ఈ మాస్క్ లను మీరు వాడి పారేసిన కొద్దిరోజులకు అవి మొక్కలవుతాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమంటున్నాడు ఈకుర్రాడు. అదెలా అంటే కాటన్ క్లాత్ తో తయారుచేయబడిన ఈ మాస్క్ లో ఓ లేయర్ లో విత్తనాలు పెట్టాడు. పండ్లు, కూరగాయల విత్తనాలను ఇందులో ఉంచాడు.
మీరు దీన్నివాడేసిన తర్వాత ఇంట్లో భూమిలో పాతితే కొద్దిరోజుల్లోనే మొక్కలు వస్తాయంటున్నాడు నితిన్ వ్యాస్. కాటన్ తో తయారుచేసింది కాబట్టి తడపవద్దంటున్నాడు. సర్జికల్ మాస్క్ లాగా మెత్తగా ఉండదు కానీ ఈ ఎకో ఫ్రెండ్లీ మాస్క్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదన్న విషయాన్ని గుర్తించుకొని వీటిని వాడమని సలహా ఇస్తున్నాడు.