బెంగళూరు : సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా లగ్జరీ కార్లలో దర్జాగా తిరుగుతున్న వాహనదారులపై కర్ణాటక రవాణాశాఖ కొరడా ఝుళిపించింది. రాజధాని బెంగళూరు నగరంలో ఆ రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ ఎల్ నరేంద్ర హోల్కర్ నేతృత్వంలో అధికారుల బృందం లగ్జరీ కార్ల ధ్రువపత్రాల పరిశీలన డ్రైవ్ చేపట్టారు. వాహన చట్టంలోని నిబంధనకు అనుగుణంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తనిఖీల్లో నిబంధనలకు అనుగుణంగా ధ్రువపత్రాలు లేని 16 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ వాహనంతో సహా 15 లగ్జరీ కార్లను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సీజ్ చేసి వాహనాల వివరాలు పరివాహన సేవ డేటా బేస్లోనూ కనిపించడం లేదని పేర్కొన్నారు. సీజ్ చేసిన రోల్స్ రాయిస్ కారు ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడిదని సమాచారం. దీన్ని 2019లో అతడు కొనుగోలు చేసినట్లు డ్రైవర్ వెల్లడించారని అధికారులు తెలిపారు. దీనికి ఇన్సూరెన్స్ కూడా లేదని వివరించారు.