న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. కార్యక్రమంలో 18-44 ఏళ్లలోపు వారికి 84,599 మంది లబ్ధిదారులకు ఫస్ట్ డోసు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. టీకాల పంపిణీ కార్యక్రమం 106వ రోజుకు చేరగా.. ఒకే రోజు శనివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 16,48,192 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పింది. వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 94.28 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు, 62.65 లక్షల మందికి రెండో డోసు వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
అలాగే 1.26 కోట్ల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు తొలి మోతాదు, 68.78 లక్షల మందికి రెండో మోతాదు అందించినట్లు పేర్కొంది. 45-60 ఏళ్లలోపు 5.33 కోట్ల మంది లబ్ధిదారులు మొదటి, 40 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారిలో 5.26 కోట్ల మందికి మొదటి, 1.14 కోట్ల మందికి రెండో డోస్ వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం సందర్భంగా వలంటీర్ గ్రూపులు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
ఇదిలా ఉండగా.. టీకాల కొరత కారణంగా చాల్లా రాష్ట్రాలో మూడో దశ వ్యాక్సినేషన్ శనివారం ప్రారంభం కాలేదు. ఈ విడతలో 18 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉన్న వారికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. కేవలం ఆరు రాష్ట్రాలు.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్ల్లో మాత్రమే వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అది కూడా కొన్ని జిల్లాలకే పరిమితమైంది. మరికొన్ని రాష్ట్రాలు తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించాయి. ఢిల్లీలో సోమవారం మొదలుపెడుతామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. వ్యాక్సిన్ నిల్వలు వచ్చాక తేదీలను ప్రకటిస్తామని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ చెప్పారు. తమ వద్ద సరిపడా టీకా డోసులు లేవని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ప్రకటించాయి. టీకా కొరతతో మూడో దశ కొద్ది రోజులు ఆలస్యమవుతుందని కేరళ స్పష్టం చేసింది.