భోపాల్ : కొవిడ్-19పై వాస్తవ గణాంకాలను వెల్లడించాలని కోరితే పాలకులు తనపై కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ కాషాయ పార్టీపై మండిపడ్డారు. తాను చేసిన భారత్ మహాన్ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ బీజేపీని దుయ్యబట్టారు. మహోన్నత దేశమైన భారత్ లో ప్రస్తుత పరిస్థితిని తాను ఎత్తిచూపితే తనను దేశద్రోహి అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఇవన్నీ లేవనెత్తితే తాను రాజకీయాలు చేస్తున్నానని అంటున్నారని చెప్పారు. వ్యాక్సిన్ డోసులు ఎవరెవరికి ఇచ్చారు అనే వివరాలు అడిగానని అందులో తప్పేం ఉందని కమల్ నాథ్ ప్రశ్నించారు.
స్మశాన వాటికలకు రోజూ పెద్దసంఖ్యలో మృతదేహాలు వస్తున్నాయని వీటికి సంబంధించిన రికార్డులు ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే తాను శవ రాజకీయాలు చేస్తున్నానని కాషాయ నేతలు ఆరోపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల్ని కమల్ నాథ్ ప్రస్తావిస్తూ భారత్ గొప్ప దేశం కాదని..బద్నాం దేశమని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే.