చెన్నై: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నటుడు కమల్ హాసన్ పార్టీ ఒంటరి పోరాటం చేయనున్నది. 9 జిల్లాల్లో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని మక్కల్ నీది మయం (MNM) నిర్ణయించింది. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో మక్కల్ నీది మయం (MNM) ఒంటరిగా పోటీ చేస్తుంది. మొత్తం తొమ్మిది జిల్లాల్లో నేను ప్రచారం చేస్తాను. మైదానంలో కలుద్దాం. విజయం మనదే’ అని కమల్ హాసన్ గురువారం ట్వీట్ చేశారు. అక్టోబర్ 6 నుంచి 9 వరకు 9 జిల్లాల్లో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో 1,521 మంది అభ్యర్థులను బరిలోకి దించాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంచి అభ్యర్థుల ఎంపిక కోసం ప్రతి జిల్లాలో జోనల్ కార్యదర్శిని ఇంచార్జీగా నియమించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కమల్ హాసన్ పార్టీ ఈ సారి భారీ విజయంతో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ ఏడాది జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (AISMK), భారతీయ జననాయక కట్చి (IJK) పార్టీలతో ఎంఎన్ఎం పొత్తుపెట్టుకున్నది.
కాగా, 2018లో పార్టీ ఏర్పాటు తర్వాత తొలిసారిగా జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి తన సత్తాను చాటాలని కమల్ హాసన్ ఉవ్విళ్లూరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పలువురు సీనియర్ నేతలు ఆ పార్టీని వీడారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి పార్టీని బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు.