న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ మొదలు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కల్యాణ్ సింగ్ మరణం మాటల్లో చెప్పలేని దుఃఖాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణం తీవ్ర బాధను మిగిల్చింది. ఆయన రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్గా పని చేశారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయడంలో ఆదర్శ ప్రాయుడు అని ట్వీట్ చేశారు. జాతీయ వాది అని పేర్కొన్నారు.
రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ స్పందిస్తూ.. కల్యాణ్ సింగ్ భారతీయ రాజకీయాల్లో ధైర్య సాహసాలు గల నేత. దేశానికి, సమాజానికి అందించిన ఆయన సేవలు చెరిగిపోవు. ఆయన మరణంతో ఓ సోదరుడ్ని కోల్పోయాను. ఆయన మరణంతో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చడం కష్టమే అని ట్వీట్ చేశారు.
కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం కల్యాణ్ సింగ్ మరణం పట్ల సంతాపం తెలిపారు. మాకు గౌరవనీయ సీనియర్ నేత కల్యాణ్ సింగ్ కన్నుమూశారని వచ్చిన వార్తలు తీవ్ర విచారాన్ని మిగిల్చాయని అని పేర్కొన్నారు. జన్సంఘ్కు, ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఆయన అత్యంత ముఖ్యమైన సేవలందించారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. కల్యాణ్ సింగ్ మరణంతో ఈ రోజు జాతి తన అమూల్యమైన పుత్రుల్లో ఒకరిని కోల్పోయింది. దేశానికి, శ్రీరాముడికి ఆయన సేవలు చిరస్మరణీయం. కల్యాణ్ సింగ్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేశారు.
కల్యాణ్ సింగ్ మరణం పట్ల బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యూపీ మాజీ సీఎంగా.. బీజేపీలో ధైర్యవంతుడైన నేతగా కల్యాణ్ సింగ్ మరణించారన్న వార్త చాలా విచారాన్ని కలిగించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత విచార సమయంలో వారికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.