మంచిర్యాల జిల్లా వేమనపల్లి ప్రాంతం అతి ప్రాచీనమైంది. చారిత్రకంగా కీలకమైంది. ప్రాణహిత పరీవాహక ప్రాంతంలోని ఈ పల్లెలో, అనేక ప్రాచీన జీవరాశుల అవశేషాలు లభించాయి. వేమనపల్లి పేరు వినగానే మొదటగా డైనోసార్ శిలాజాలే గుర్తుకొస్తాయి. ఇక్కడికి కూతవేటు దూరంలోని రాజారాం గ్రామంలో బృహత్ శిలలతో మలచిన దశావతార విగ్రహాలు అబ్బుర పరుస్తున్నాయి.
వేమనపల్లి ప్రాంతాన్ని శాతవాహనులు మొదలుకొని నిజాం షాహీల దాకా పాలించినట్లు చరిత్ర చెబుతున్నది. ఇక్కడి ప్రాణహితకు 3 కిలోమీటర్ల దూరంలోని రాజారాం గ్రామం కూడా చారిత్రకంగా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ గ్రామశివారులో 12, 13వ శతాబ్దం నాటి భారీ దశావతార విగ్రహాలు, అప్పటి చారిత్రక వైభవాన్ని కండ్లకు కడుతున్నాయి. వీటిని యాదవ మహారాజు కుమారుడైన అమ్మన రాజు చెక్కించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఈ ప్రాంతంలో గొప్ప ఆలయాన్ని నిర్మించే లక్ష్యంతో భారీ శిలలతో ఈ దశావతార మూర్తులను చెక్కించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, ఏ కారణాల వల్లనో ఆలయాన్ని నిర్మించకపోవడంతో విగ్రహాలు నిరర్థకంగా పడున్నాయి. ఈ ప్రతిమల్లో కూర్మ , నృసింహ అవతారాలుసహా పలు విగ్రహాలు ధ్వంసమయ్యాయి. మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. కాళీయ మర్దనుడు, వేణుగోపాలుడు, పరశురాముడు, బుద్ధుడు, గణపతి, భైరవుడు, ఎల్లమ్మ, మునిరాజు, లక్ష్మీదేవి, ఆంజనేయుడి విగ్రహాలు మాత్రం నిలిచి ఉన్నాయి. వీటిలో గణపతి విగ్రహం అతిపెద్దది. దీనిని ఈ ప్రాంతం నుంచి తరలించి వేమనపల్లిలోని శివాలయం ఎదుట ఉంచారు. రంగులతో శోభాయమానంగా తీర్చిదిద్ది, నిత్యపూజలు చేస్తున్నారు. చెన్నూర్లో శివలింగాలను ప్రతిష్ఠించిన అగస్త్య మహర్షి, రాజారాంలోని దశావతార విగ్రహాలనూ సందర్శించి, ఇక్కడినుంచి కాళేశ్వరం వెళ్లినట్లు స్థలపురాణం చెబుతున్నది.
అరుదైన విగ్రహాలు
దశావతార విగ్రహాలు ఒక్కచోటే కనిపించడం చాలా అరుదు. వేమనపల్లి శివాలయంలో గణపతి, అటవీశాఖ విశ్రాంత గృహానికి వెనుకభాగంలో మహా నాగమూర్తులు దర్శనమిస్తున్నాయి. రోడ్డుకు ఒకవైపు క్షేత్రపాలకుడైన భైరవుడి 8 అడుగుల విగ్రహం ఉన్నది. సమీపంలోనే కూర్మవిగ్రహం కనిపిస్తున్నది. అయితే, దుండగులు గుప్తనిధులకోసం ఈ విగ్రహాన్ని మధ్యలోకి పగులగొట్టారు. చెట్టుకింద ఆరడుగుల ఎత్తులో, ధ్యాన బుద్ధుడి విగ్రహం ఉన్నది. సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహం 8 అడుగులకు పైగా ఉన్నది. పక్కనే చెట్ల పొదల్లో కాళీయ మర్దనుడు దర్శనమిస్తాడు. రోడ్డుకు మరోవైపున పందిరి కింద మరికొన్ని విగ్రహాలను చూడవచ్చు. పిల్లనగోవి ఊదుతున్న వేణుగోపాలుడి విగ్రహం, ఆరడుగుల ఎత్తుతో అలరారుతున్నది. పక్కన గోవు, ఇతర విగ్రహాలూ ఉన్నాయి. స్వామివారికి ఇరువైపులా మరో రెండు విగ్రహాలు వున్నాయి. వీటితోపాటు ఇక్కడి పరశురాముడి విగ్రహం అత్యంత ఘనంగా దర్శనమిస్తున్నది. ఒకవైపు గొడ్డలి, మరోవైపు ధనుర్బాణాలు ధరించిన దివ్యరూపం అబ్బుర పరుస్తుంది. ప్రహ్లాదుడి కోరిక మేరకు ఆవిర్భవించిన నారసింహస్వామి విగ్రహమూ పక్కనే ఉన్నది. హిరణ్యకశిపుడిని తొడపై పెట్టుకొని, కడుపు చీల్చుతున్న రౌద్రరస భంగిమ రోమాంచితులను చేస్తుంది. ఒకే రాతిపై ఇంత పెద్ద విగ్రహం చెక్కడం అత్యద్భుతం. ప్రతి విగ్రహంలోనూ, ప్రతి విషయాన్నీ శిల్పులు ఎంతో స్పష్టంగా తీర్చిదిద్దడం విశేషం. దేని ప్రత్యేకత దానిదే అనాలి.
ఏటా ఉత్సవాలు
దశావతార విగ్రహాలను చూసేందుకు ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు. ఈ విగ్రహాలు ఎక్కడినుంచి వచ్చాయి, ఎవరు తెచ్చారనేది మాత్రం తెలియదు. ఇక్కడి ఎల్లమ్మ దేవతకు ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. బోనాలు వండి నైవేద్యం సమర్పిస్తూ, మొక్కులు తీర్చుకుంటాం. పక్కనే మునిరాజు, లక్ష్మీదేవి విగ్రహాలూ ఉన్నాయి.
-పెరుమాండ్ల లస్మయ్య, పూజారి
-కొమ్మెర రామమూర్తి
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ